కాంగ్రెస్ పార్టీవి కుళ్లు రాజకీయాలు: రాజ్నాథ్ సింగ్
సోమవారం, 23 నవంబర్ 2009( 13:05 IST )
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇలా చేస్తోందని ఆరోపించారు. లిబెర్హాన్ కమిషన్లోని కొన్ని అంశాలు ఒక పత్రికలో లీక్ అయన విషయం తెల్సిందే. వీటిపై పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లాయి.
దీనిపై రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కొన్ని వాఖ్యాలను మాత్రమే యూపీఏ ప్రభుత్వం లీక్ చేసిందని ఆరోపించారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కాగా, ఈ కమిషన్ తయారు చేసిన నివేదికలో ఆ పార్టీకి చెందిన వాజ్పేయి, అద్వానీ, ఎంఎం జోషీల పేర్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఓ ఉద్దేశం ప్రకారమే కొన్ని వాఖ్యాలు మాత్రమే లీక్ చేశారు. ఏ కమిషన్ నివేదిక అయిన పార్లమెంట్ సమావేశాల తొలిరోజునే ప్రవేశపెట్టడం సంప్రదాయం. యూపీఏ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశాలు జులైలో జరిగాయి. లిబెర్హాన్ కమిషన్ తన నివేదికను జూన్ 30వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిందని ఆయన గుర్తు చేశారు.