'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్పై శివసేన మరోమారు విమర్శలు వర్షం గుప్పించింది. ఈ దఫా మాత్రం సేన చీఫ్ బాల్థాక్రే ఆ పాత్రను పోషించలేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్వీకరించారు. పార్టీ పత్రికలో సచిన్పై విమర్శల వర్షం గుప్పించారు. సచిన్ నిజమైన మహారాష్ట్ర వాది కాదని ధ్వజమెత్తారు.
క్రికెట్ ప్రపంచంలో సచిన్ గొప్ప క్రికెటర్ కావచ్చు. కానీ మహారాష్ట్ర వాదుల్లో గొప్పేమి కాదన్నారు. సాటి మహారాష్ట్ర వాదులకు సాయం చేయాలన్న గుణం సచిన్లో ఏ కోశాన లేవన్నారు. ఈ విషయంలో సచిన్ కంటే మాజీ లెజండ్ సునీల్ గవాస్కర్ మిన్న అని అభివర్ణించారు.
చివరకు తన బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీకి కూడా ఏమాత్రం సాయపడలేదని దుయ్యబట్టారు. గవాస్కర్ భారత జట్టు కెప్టెన్గా ఉన్న సమయంలో జట్టులో సగం మంది మరాఠీయులో ఉండేవారని గుర్తు చేశారు. కానీ, ఇపుడు వ్యక్తిగత స్వార్థమే పరమావధిగా పని చేస్తున్నారని ఆరోపించారు.
ఫలితంగా కోట్లాది రూపాయల ఆస్తులకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. కోల్కతాకు సౌరవ్ గంగూలీ ఏ విధంగా ఐకాన్లా ఉన్నారో... ఆ విధంగా మహారాష్ట్రకు సచిన్ ఐకాన్లా ఉంటారని తాము భావించామని కానీ, అది ఆచరణలో లేదన్నారు.
'ముంబైయి అందరిదీ' అని వ్యాఖ్యానించిన సచిన్పై శివసేన అధినేత బాల్థాక్రే తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. దీనిపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బీసీసీఐ సచిన్కు బాసటగా నిలిచింది. దీంతో బాల్థాక్రే వెనకంజ వేశారు. అయితే సంజయ్ రౌత్ మాత్రం సచిన్ను వదిలిపెట్టక పోవడం గమనార్హం.