భవిష్యత్లో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టాలనే ఆశ ఏమాత్రం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. తన హయాంలో పార్టీని మరింత బలోపేతం చేసి, తిరిగి అధికారంలోకి తీసుకుని రావడమే తన ముందున్న అతిపెద్ద సవాల్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన తాజాగా ఒక జాతీయ ఛానల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అత్యుత్తమ పాలన అందిస్తూ, దేశంలోని భాజపా పాలిత రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. అయితే భవ్యష్యత్లో ఆయన ప్రధాని అభ్యర్థి అవుతారా అన్న అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం జరగలేదని గడ్కారీ సమాధానం ఇచ్చారు.
దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి మోడీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. భాజపా పాలిత రాష్ట్రాలలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి, మంచి పాలన ఎలా అందించాలి అన్న అంశంపై తాను ఒక సమావేశం నిర్వహించనున్నట్లు గడ్కారీ తెలిపారు.