సమస్యల పరిష్కారం దిశలోభాగంగా ప్రభుత్వం, తీవ్రవాదుల మధ్య జరిగే చర్చల కోసం జైళ్లలో మగ్గుతున్న ఉల్ఫా తీవ్రవాదులను విడుదల చేస్తామని అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తెలిపారు. అయితే, ఉల్ఫా తీవ్రవాదులు ప్రభుత్వం చర్చలు జరుపేందుకు సిద్ధంగా ఉన్నట్టు లాంఛన ప్రాయంగా వారి నుంచి సమాచారం అందాల్సి వుందని ఆయన చెప్పారు.
దీనిపై ఆయన శుక్రవారం గౌహతిలో మాట్లాడుతూ.. శాంతి చర్చలు జరిగితే పూర్తి స్థాయి గౌరవప్రదంగానూ, హుందాతోనూ జరుగుతాయన్నారు. ఏడుగురు ఉల్ఫా నాయకులు ప్రస్తుతం వివిధ జైళ్ళలో ఉన్నారని, వీరిలో ఆరుగురు గువాహటి జైలులో ఉన్నట్టు తెలిపారు. జైళ్ళలో ఉన్న ఉల్ఫా నాయకుల నుంచి చర్చలకు సానుకూల సంకేతాలు అందుతున్నట్టు ముఖ్యమంత్రి గొగోయ్ చెప్పారు.
రాజకీయ పరిస్థితులను ప్రస్తావించి రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్ణీత సమయానికి 2011లోనే జరుగుతాయనీ, ముందస్తు ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. కాగా, 2001, 2006 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే వరుస విజయాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.