అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా రాజన్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు పార్టీకి ముంబై మహానగర పోలీసు కమిషనర్లు పలువురు హాజరైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
ముంబై నగర శివారు ప్రాంతంలో జరిగిన ఈ పార్టీలో ముంబై నగర అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రకాష్ వానీ పాల్గొని, పీకలదాకా మద్యం సేవించి చిందులేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ను టీవీ ఛానల్స్ బయటపెట్టాయి. ప్రకాష్ వానీతో పాటు.. మరో ఐపీఎస్ అధికారి కూడా ఈ విందు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుండగా, ఈ వీడియో క్లిప్పింగ్స్లలో ఉండేది ఏసీపీ ప్రకాష్ వానీయేనా అనే అంశంపై ముంబై పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. జైలు నుంచి విడుదలైన కొందరు కీలక దోషుల కోసం కిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం.
ఈ పార్టీకి రాజన్కు అత్యంత సన్నిహితుడైన డీకే.రావు ముఖ్య అతిథి. 30 కేసుల్లో దోషిగా తేలిన రావు... 13 సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. కాగా, ఈ పార్టీ దృశ్యాలను ఎవరో అగంతకుడు టీవీలో బంధించి, ఒక టీవీ ఛానల్కు ఇవ్వడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.