ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేటినుంచి తిరువనంతపురంలో 97వ సైన్స్ కాంగ్రెస్ (National | 97th Indian Science Congress | Thiruvananthapuram | Kerala University | Kariavattom |)
97వ భారత సైన్స్ కాంగ్రెస్ ఆదివారం తిరువనంతపురంలో ప్రారంభం కానుంది. కేరళ విశ్వవిద్యాలయంలోని కారియవట్టోం క్యాంపస్లో జరుగనున్న ఈ సదస్సును దేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భారీ భద్రత నడుమ ప్రారంభించనున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు దాదాపు ఏడువేల మంది శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.
కాగా, సోమవారం నుంచి జరిగే చిన్నారుల సైన్స్ కాంగ్రెస్ను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కాంగ్రెస్లో పాల్గొనేందుకుగానూ ప్రధాని మన్మోహన్ శనివారం రోజునే తిరువనంతపురం చేరుకున్నారు. ఆయనతోపాటు శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు, పాలసీ మేకర్లు, విద్యార్థులు తదితరులు కూడా ముందుగానే అక్కడికి చేరుకున్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురం మొట్టమొదటిసారిగా ఈ భారత సైన్స్ కాంగ్రెస్కు ఆతిథ్యం ఇవ్వటం విశేషం. ఇందులో భాగంగా ఎలాంటి అపశృతులు దొర్లకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఇందుకోసం 1000 మంది పోలీసులతో కారియవట్టోంలోని కేరళ యూనివర్శిటీ క్యాంపస్ పరిధిలోనూ, చుట్టూ ఉండే 15 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.