ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన ముంబయి పర్యటనలో ఆయనను అడ్డుకునేందుకు శతవిధాలా యత్నించి విఫలమైన బాల్ థాకరే కొత్తగా మరో అంశంతో రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు. ముంబయిలో పర్యటించిన సమయంలో రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ముంబయిని ముంబయి అని సంబోధించకుండా "బాంబే" అని పదే పదే అన్నారని, అది మహారాష్ట్రీయులను కించపరిచినట్లేనని కొత్త పల్లవి అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వ్యవహార శైలితో మహారాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి బానిసత్వం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర హోం మంత్రి బాగ్వే రాహుల్ గాంధీ బూట్లను మోయడాన్ని చూస్తే ఈ విషయం అర్థమవుతోందని అన్నారు.
రాహుల్ గాంధీ చెప్పులు మోయడానికి ఆయన మహాత్మా గాంధీ అంతటివాడు కాదని బాల్ థాకరే సామ్నా పత్రిక ఎడిటోరియల్లో రాశారు.