ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » త్రిపుర రాష్ట్ర వ్యవసాయానికి బంగ్లాదేశ్ నదీజలాలు (Tripura | Bangladesh | Feni River | Cultivation | Sabroom Division)
భారత్-బంగ్లాదేశ్ దేశాల మద్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. బంగ్లా సరిహద్దు రాష్ట్రమైన త్రిపురలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఆ దేశ ప్రభుత్వం ముందుకు వచ్చింది. బంగ్లాలోని ఫెనీ నదీ జలాలను త్రిపురలోని సబ్రూమ్ సబ్ డివిజన్ ప్రాంతానికి సాగు, తాగు నీటి అవసరాలకు సరఫరా చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఈ విషయాన్ని త్రిపుర తాగునీటి ప్రధాన ఇంజనీర్ తపన్ లోథ్ మంగళవారం వెల్లడించారు. మహ్మద్ షీదుల్ ఇస్లామ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులున్న బంగ్లాదేశ్ జలవనరుల అభివృద్ధి మండలి సాంకేతిక బృందం సోమవారం సబ్రూమ్ ప్రాంతంలో పర్యటించి, స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించింది.
అనంతరం సాగుకు, తాగు నీటి అవసరాలకు ఫెనీ నది నీటి వినియోగానికి ఆ బృందం అంగీకరించినట్లు తపన్ లోథ్ వెల్లడించారు. త్రిపుర ఇంజనీర్ల బృందానికి లోథ్ నాయకత్వం వహించారు. 6.5 లక్షల గ్యాలన్ల నీటి విడుదలకు బంగ్లాదేశ్ అంగీకరించిందని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇటీవల భారత్లో పర్యటించినపుడు దీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న నదీ జలాల పంపిణీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెల్సిందే.