ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్ష పార్టీల ఐక్యతారాగం! (Price rates | Opposition parties | Congress | BJP | JDU | Lalu | Mulayam)
నిత్యావసర వస్తు ధరలపై ప్రతిపక్ష పార్టీల ఐక్యతారాగం!
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010( 17:32 IST )
ధరల పెరుగుదలపై జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యతారాగాన్ని ఆలపించాయి. ఇప్పటికే ధరల పెరుగదలతో ప్రజలు అల్లాడుతుంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 7.5 శాతం పెంచడాన్ని విపక్షాలన్నీ ఖండిస్తున్నాయి. దీనికి నిరసనగా అన్ని పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పాఠం కొనసాతుండగా అన్ని విపక్ష పార్టీలు మూకుమ్మడగా సభ నుంచి వాకౌట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బడ్జెట్పై తమ వాదనలు వినిపించేందుకు అవసరమైన చర్చకు అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా వాకౌట్ చేయడం గమనార్హం. దీనిపై భాజపా ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ నిత్యావసర వస్తు ధరలపై గత రెండు రోజులుగా సభలో చర్చ సాగిందన్నారు. ఫలితంగా ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ధరలకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపడుతుందని భావించామన్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం తద్విరుద్ధంగా పెట్రో ఉత్పత్తులపై అదనపు సుంకం విధించడం వల్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే, జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ మాట్లాడుతూ గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఇదే కాంగ్రెస్ సభ్యులు సభను 16 రోజుల పాటు సాగకుండా అడ్డుకున్నారన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇపుడు ప్రజల నడ్డి విరుస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
సీపీఎం సభ్యుడు గురుదాస్ గుప్తా మాట్లాడుతూ ధరలపై పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాల తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పందిస్తూ ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా, విపక్షాలు వాకౌట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు తెచ్చేలా ఉందన్నారు.