ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాజీవ్ హత్య కేసు: నళిని విడుదలకు రంగం సిద్ధం! (Nalini | Rajiv murder case | Vellore jail | High court | Tamilnadu)
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు నళిని విడుదల చేసే అంశంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆమె విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ.. జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి వంటి వారు నళిని విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన శిక్షాకాలం పూర్తయినందువల్ల తనను విడుదల చేయాలని నళిని దాఖలు చేసుకున్న పిటీషన్పై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ గత కొన్ని నెలలుగా విచారణ జరుపుతోంది. ఇదిలావుండగా, నళిని విడుదల చేసే అంశంపై వేలూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక సలహా సంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘం నళిని విడుదలకు సంబంధించిన అంశాలన్నీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ నివేదికను గురువారం ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సమర్పించింది. అయితే, నళిని విడుదల చేసే అంశంపై నివేదిక సమర్పించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోరడంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చే నివేదికను అనుసరించి నళిని విడుదలపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.