ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు సోమవారం వెయ్యి రూపాయల నోట్లతో తయారు చేయించిన "డబ్బుల మాల"ను బహుకరించారు. ఆ డబ్బుల మాలపై ఆదాయపన్ను శాఖాధికారులు విచారణ చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
బహుజన్ సమాజ్ పార్టీ రజతోత్సవాలు జరిగిన తీరుతెన్నులు, పార్టీ ఉత్సవాలకు ఎవరెవరు ఎంత ఖర్చు చేశారు, " డబ్బుల మాల"ను మాయావతికి సమర్పించిన ప్రధాన సూత్రదారులెవరు అనే దానిపై ఆదాయపన్ను శాఖాధికారులు విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం.
బహుజన్ సమాజ్ పార్టీ రజతోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ రజతోత్సవాలలో మాయావతికి బీఎస్పీ కార్యకర్తలు సభలో బహుకరించిన డబ్బుల మాలపై లోక్సభలో మంగళవారం పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై విచారణ జరపాలని సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని విలువ దాదాపు రూ. 15 కోట్ల మేరకు ఉంటుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సభకు వివరించారు. ఇందులో అన్నీ వెయ్యి రూపాయల నోట్లే ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని లోక్సభలో సమాజ్వాదీ పార్టీతోపాటు, కాంగ్రెస్, భాజపా పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి. డబ్బుల మాలతో మాయావతి వార్తలలోకెక్కడంతో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ బీఎస్పీ అధినేత్రిని ఎద్దేవా చేశారు. మాయావతి ప్రస్తుతం "దళితుని కూతురు కాదని, ధనికుని కూతురు"గా ఆయన అభివర్ణించారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు బహుకరించిన డబ్బుల మాలలో అన్నీ వెయ్యి రూపాయల నోట్లే ఉన్నాయని ఆయన తెలిపారు. మాయావతి సోమవారం చేపట్టిన ర్యాలీ, ఆమెకు బహుమానంగా వచ్చిన డబ్బుల మాలపై విచారణ చేపట్టాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదిలావుండగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మాయావతికి బహుకరించారని బీఎస్పీ పార్టీకి చెందిన నేతలు తెలిపారు. తమ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తమ పార్టీ అధినేత్రి కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని కొందరు కార్యకర్తలు వ్యాఖ్యానించడం గమనార్హం.