తమ వద్ద బందీలుగా ఉన్న ముగ్గురు పోలీసులు సురక్షితంగా ఉన్నారని మావోయిస్టులు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు రావాలని మావోయిస్టు ప్రతినిధి అవినాష్ శనివారం ప్రటించారు.
జైళ్ళలో ఉన్న తమ ఎనిమిది మంది అనుచరులను విడుదల చేయాలని కోరుతూ నలుగురు పోలీసులను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నలుగురిలో ఒకరిని మావోలు హతమార్చారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులతో పాటు బందీల ఆచూకీ తెలుసుకునేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కూంబింగ్ ఆపరేషన్ను మరింత ఉధృతం చేసింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలావుండగా, ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మావోల డిమాండ్తో పాటు బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఆయన అన్ని చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రతినిధిగా చెప్పుకుంటున్న అవినాష్ స్వయంగా మీడియా సంస్థలకు ఫోన్ చేసి తమ వద్ద ఉన్న ముగ్గురు పోలీసులు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు.
అందువల్ల తక్షణం కూంబింగ్ ఆపరేషన్ నిలిపి వేసి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ముగ్గురు పోలీసు అధికారులు క్షేమంగా ఉన్నారని రుజువు చేసేలా వారి మాటలతో కూడిన ఆడియో సీడీని మావోయిస్టులు విడుదల చేసినట్టు అవినాథ్ వెల్లడించారు.