మహమ్మదీయుల పండుగ రంజాన్ను పురస్కరించుకుని కాశ్మీర్ మొత్తం గురువారం కర్ఫ్యూను ఎత్తివేశారు. రంజాన్ నోము పూర్తికావడంతో పాటు నెలవంకను చూసిన తర్వాత ముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కాశ్మీర్ పోలీసు యంత్రాంగం కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలు పహరా కాసేందుకు సిద్ధమయ్యాయని పోలీసు శాఖ వెల్లడించింది.
కాగా.. సోమవారం జమ్మూకాశ్మీర్లో జరిగిన అల్లర్లలో నలుగురిని భద్రతా దళ సిబ్బంది కాల్చి చంపడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంకా భద్రతా దళ సిబ్బందిపై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశారు. దీంతో కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ ప్రాంతంలో కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పోలీసు శాఖ ప్రకటించింది.