ఒరిస్సా జిల్లా కందమాల్ జిల్లాలో చోటు చేసుకున్న మత ఘర్షణల సందర్భంగా ఒక హత్య కేసులో సంబంధం ఉన్నందుకు గాను భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు స్థానిక ఫాస్ట్ట్రాక్ కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 ఆగస్టు 26వ తేదీన రైకియా పోలీసు స్టేషన్ పరిధిలోని త్రియాంగియా గ్రామంలో బుదేడిపడకు చెందిన బిక్రమ్ నాయక్ అనే క్రైస్తవుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే మనోజ్ ప్రధాన్ను రెండో ఫాస్ట్ట్రాక్ కోర్టు మేజిస్ట్రేట్ సి.ఆర్.దాస్ గురువారం దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చారు.
అలాగే, ఘర్షణల సందర్భంగా పలువురు మైనార్టీల ఇళ్ళకు నిప్పు పెట్టినందుకుగాను ఆయనకు 15 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. మొదట్లో రాజ్కియా పోలీసులు స్టేషన్లో దాఖలైన ఎఫ్ఐర్లో జి.ఉదయగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన్ పేరు లేనప్పటికీ, దర్యాప్తు సందర్భంగా ఈ హత్యలో ఆయన ప్రమేయం వెలుగులోకి వచ్చింది.
కాగా, కందమాల్లో విశ్వ హిందూపరిషత్ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య అనంతరం ఈ జిల్లాలో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘర్షణల్లో కనీసం 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలకు సంబంధించి ప్రధాన్పై డజను దాకా కేసులు నమోదైవున్నాయి. వీటిలో రెండు హత్య కేసుల్లో మాత్రం శిక్ష పడగా, మరో ఏడు కేసుల్లో నిర్దోషిగా విడిచిపెట్టారు.