ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా యమునానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సాధారణ నీటి మట్టం 204.83 కంటే 65 సెంటీమీటర్లు ఎక్కువగా ప్రవహిస్తోంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడివుంది. దీంతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
గత కొద్ది రోజులు, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. దీంతో అన్ని నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లు, డ్యామ్లు పూర్తిగా నిండాయి. దీంతో ఎగువ రాష్ట్రాలు నీటిని భారీ ఎత్తున విడుదల చేశాయి. దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు సమాచారం. దీంతో యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ముప్పుపై 24 గంటల పాటు పర్యవేక్షణ పెట్టింది. ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి రాజ్కుమార్ చౌహాన్ ఉన్నతాధికారులతో అత్యసవర సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల వాసులను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అనేక బోట్లతో పాటు లైఫ్ సేవింగ్ జాకెట్లను కూడా పంపారు. ఇదిలావుండగా, వరద ముప్పుపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల వాసులను 20-25 రోజుల నుంచే అప్రమత్తం చేసినట్టు తెలిపారు. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు.