వివాదాస్పద అయోధ్య-బాబ్రీ మసీదు అంశంపై ఈనెల 24వ తేదీన అలహాబాద్ కోర్టు ఇచ్చే తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్యపై కోర్టు ఇచ్చే తీర్పు కోసం తామంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామన్నారు. ఈ తీర్పును అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రతి పౌరుడూ గౌరవించాలన్నారు.
ఇకపోతే కేంద్రంలోని యూపీఏ సర్కారు తన ఆర్థిక విధానాలను మార్చుకోక పోతే మున్ముందు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇప్పటికైనా తమ విధానాలపై సమీక్ష చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని స్థానాలకే పోటీ చేస్తుందన్నారు. మొత్తం 243 సీట్లకు సీపీఎం కేవలం 30 సీట్లలో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆ పార్టీ వామపక్షాలైన సీపీఐ, సీపీఐ-ఎంఎల్ పార్టీతో ఇప్పటికే ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నట్టు కారత్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.