భారతదేశం రహస్యాలకు, అభూతకల్పనలకు నిలయం...అనేక సంప్రదాయాలకు, విశ్వాసాలకు పట్టుగొమ్మ ఈ భూమి. కానీ నమ్మకం, గుడ్డి నమ్మకంగా పరిణామం చెందిన క్రమంలో సంప్రదాయాలు మూఢనమ్మకాలుగా రూపాంతరం చెందుతాయి. 'ఏది నిజం' శ్రేణిలో భాగంగా 'గాయ్ గౌరీ'గా పిలవబడుతూ గోవులను పూజించే విన్నూత్నమైన సంప్రదాయాన్ని మీకు పరిచయం చేస్తున్నాము. మధ్యప్రదేశ్లోని జబువా ప్రాంతంలో ఈ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు.
భారతదేశంలో ఆవుకు గోమాతగా ప్రత్యేక గౌరవం ఉన్నది. ప్రస్తుత కాలంలో గిరిజన ప్రాంతాలలోని అనేక కుటుంబాలు గోవులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాయి. గోమాత పట్ల తమకు భక్తిప్రపత్తులను, గౌరవాన్ని చాటుకునేందుకు గిరిజనులు గాయ్ గౌరీ ఉత్సవాన్ని జరుపుకుంటుంటారు. దీపావళి పండుగ మరుసటి రోజు 'గాయ్ గౌరీ' ఉత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణులు తమ ఆవులకు శుభ్రంగా అభ్యంగనస్నానం చేయించి, అలంకరిస్తారు. అలంకరించబడిన ఆవుల మందతో సహా పూజలు జరిపేందుకు 'గోవర్ధన్' దేవాలయానికి చేరుకుంటారు.
ప్రార్థన అయిన తర్వాత పశువుల మందతో ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ పద్ధతిని 'పరిక్రమ' అని పిలుస్తారు. భీతి గొలిపే రీతిలో ఆవుల మంద ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు ఆవులమందకి ఎదురుగా నేలపై సాష్టాంగపడతారు. 'గోమాత' దీవెనలకోసమంటూ... ఆ సమయంలో ఆవుల మంద వారిపై నడుచుకుంటూ వెళ్లిపోతాయి. తమ కుటుంబం సుఖసంతోషాల కోసం ఈ ప్రాంతంలోని గిరిజనులు ఇలా చేస్తుంటారు... ఎటువంటి జంకు గొంకూ లేకుండా ఈ భయంకరమైన సంప్రదాయాన్ని గ్రామీణులు ప్రతి ఏటా ఆచరిస్తుంటారు. అంతే కాక సంప్రదాయాన్ని ఆచరించే రోజున పూర్తిగా ఉపవాసముంటారు.
|