రాక్షసుడిని పవిత్రమైన దేవుడిగా కొలిచి మొక్కడం మనం ఎక్కడైనా విన్నామా? ఏది నిజం సీరీస్లో భాగంగా ఈసారి మిమ్మల్ని ఆ రాక్షసుడి దగ్గరికే తీసుకుపోతాం మరి. చాలామంది భక్తులు ఇతగాడిని తమ ఇంటి ఇలవేల్పుగా నమ్ముతున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో నందూర్ నింబాదిత్య అనే గ్రామం ఉంది. ఇక్కడ మీరు రాక్షసుడి ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడి ప్రజలు నింబాదిత్య పేరున్న రాక్షసుడికి పూజలు చేస్తూండటం విశేషం. ఈ ప్రాంతం విశేషం ఏమిటంటే ఇక్కడ నివసిస్తున్న వారు ఆంజనేయుడి పేరు ఉచ్ఛరించరు. పైగా ఈ ప్రాంతం సమీపంలో ఆంజనేయుడి దేవాలయం మచ్చుకైనా కనబదు.
ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్న దాని మేరకు రాముడు తన భార్య సీతను వెదకడంలో భాగంగా కేదారేశ్వర్లో ఉన్న వాల్మీకి మహర్షిని సందర్శించినపుడు ఇక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో నింబాదిత్య భక్తిప్రపత్తులతో రాముని సేవించి, మెప్పించాడు. ఈ క్రమంలో రాముడి సేవకుడిగా మారాడు. అతని సేవలకు మెచ్చిన రాముడు ఈ గ్రామంలో చిరకాలం వెలసి ఉంటావని వరం ప్రసాదించాడు.
ఈ గ్రామ ప్రజలు నింబాదిత్యను ఇంటి ఇలవేల్పుగా భావించి పూజిస్తారు కాబట్టి ఇకపై వారు హనుమంతుడిని ప్రార్థించరని రాముడు చెప్పాడు. బయటి ప్రాంతం నుంచి ఎవరైనా హనుమాన్ పేరుతో ఈ గ్రామాన్ని సందర్శించినట్లయితే మొదట అతడు తన పేరును మార్చుకున్న తర్వాతే గ్రామంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
ఈ గ్రామ ప్రజలు దేశంలోనే సుప్రసిద్ధమైన బ్రాండ్ కారును ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించరని ఏక్నాథ్ జనార్ధన్ పాల్వే అనే ఉపాధ్యాయుడు తెలిపారు ఆ కంపెనీ హనుమంతుడి పేరును కలిగి ఉండటమే ఇందుకు కారణం. ఈ గ్రామంలోని అనేక మంది ప్రజలు బ్రతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళతారు కానీ... నింబాదిత్య జాతర సమయంలో తప్పనిసరిగా తమ నివాస ప్రాంతాన్ని చేరుకుంటారు.
|