కాలానుగుణంగా, శాస్త్రసాంకేతిక రంగాలలో వస్తున్న ఆశాజనక పరిణామాలతో మానవుడు ముందుకు సాగుతున్న వైనం అందరికీ తెలిసిందే. దేశగతిని మలుపుతిప్పే సాంకేతిక ఆవిష్కరణలో సైతం ముహూర్తాలను చూసుకునే అంతుపట్టని ఆచారం, మూఢ నమ్మకం మరియు ఆధునికతల సంధి యుగంలో మనం జీవన యానం సాగిస్తున్నాం.
ఈ నేపథ్యంలో తాను చూసాను అనుకుంటున్నది నిజమో అబద్ధమో తేల్చుకోలెని అయోమయ పరిస్థితిలో విశ్వాసానికి, విజ్ఞానానికి మధ్య ఊగిసలాడుతున్న యువకుని మానసిక స్థితిని 'ఇదీ సంగతి'లో అందిస్తున్నాము.
నవంబర్ 23, 2007... రాత్రి తొమ్మిది గంటలయ్యింది. మధ్యాహ్నం షిఫ్ట్కు వచ్చిన ప్రసాద్ ఆఫీసులో కూర్చుని సీరియస్గా పని చేసుకుంటున్నాడు. అదేసమయంలో ప్రసాద్ సెల్ ఫోన్ మోగింది. ఫోన్ ఆన్సర్ చేశాడు ప్రసాద్. అవతల్నుంచి సుబ్బారావు మామయ్య మాట్లాడుతున్నారు. "హలో ప్రసాద్.. ఎక్కడున్నావ్?" "ఆఫీసులో ఉన్నాను." సమాధానమిచ్చాడు ప్రసాద్. "అయితే వెంటనే బయటకు వెళ్ళి చందమామను చూడు... సత్యసాయిబాబా కనపడతాడు." మామయ్య చెపుతున్నది ప్రసాద్కు అర్ధం కాలేదు. "చందమామ ఏంటీ... సత్యసాయిబాబా కనపడటం ఏంటీ...ఏంటి మామయ్య సరిగా చెప్పు..." గట్టిగా అడిగాడు ప్రసాద్. "అర్జెంట్గా వెళ్ళి చందమామను చూడు.. నీకే అర్థమవుతుంది.. ఉంటాను.." మామయ్య ఫోన్ డిస్కనెక్ట్ చేశారు.
|