ఈ స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే భక్తులు సమర్పించే పానకాన్ని మొత్తంగా స్వీకరించే స్వామివారు అందులోని కొంతభాగాన్ని భక్తులకు తిరిగి వెనక్కు ఇచ్చేస్తుంటారు. భక్తులు ఎంత పరిమాణంలో పానకం సమర్పించినా సరే అందులో ఖచ్చితంగా సగభాగాన్నిమాత్రం స్వామివారు వెనక్కి ఇచ్చేస్తారు. చిత్రంగా వుంది కదూ... అయినా ఇది నిజం.
భక్తులు తాము తెచ్చిన పానకాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత స్వామి నోటినుండి సగభాగం పానకం వెలుపలకి వచ్చేస్తుంది. ఆ పానకాన్ని అత్యంత భక్తితో భక్తులు సేవిస్తుంటారు. మంగళగిరి క్షేత్రంలో జరిగే ఈ వింతను ప్రత్యక్షంగా చూడడానికే భక్తులు అనునిత్యం వేలాదిగా తరలివస్తుంటారు.
ఇప్పటివరకు చెప్పిన ఈ విశేషంలోనే మనం ప్రారంభంలో చెప్పుకున్న విశేషం కూడా ఉంది. వేలాదిగా వచ్చే భక్తులు తమవెంట పానకాన్ని తీసుకువచ్చి ఇక్కడ స్వామివారికి సమర్పించడం, స్వామివారు తిరిగి ఇచ్చిన పానకాన్ని తాము సేవించడం లాంటి కార్యక్రమాల సందర్భంగా ఎంత పానకం కిందపడ్డా ఈ క్షేత్రంలో ఒక్క చీమ కూడా కన్పించదు.
బెల్లం కలిపి చిక్కగా తయారు చేసే పానకం సువాసనకు మనం ఎంతగా ఆకర్షితమవుతామో తెలిసిందే. అలాంటి ఆ పానకం కొన్ని చుక్కలు కిందపడ్డా క్షణాల్లో చీమలు చేరిపోవడం చూస్తుంటాం. అలాంటిది ఈ క్షేత్రంలో ఎంత పానకం కింద ఒలికినా ఒక్క చీమ కూడా రాకపోవడం నిజంగా క్షేత్ర మహిమే కదూ... అంతా ఆ నృసింహ స్వామి మహిమ.
|