ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహానికి రూ.2.65 కోట్లతో ఇన్స్యూరెన్స్ పాలసీని నిర్వాహకులు తీసుకున్నారు. అంతే కాదు ఈ స్వామి వారి దర్శనం కోసం వచ్చే సుమారు 15 లక్షల మంది భక్తుల కోసం కూడా రూ.కోటి ఇన్య్సూరెన్స్ పాలసీ తీసుకున్నారట.
ముంబైలోని బరేలీ ప్రాంతంలో లాల్ బావ్సా రాజా అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ పెద్ద వినాయకుని విగ్రహం చాలా ప్రసిద్ధి గాంచింది. లాల్ బావ్సా రాజా సర్వజనిక్ గణేశ ఉత్సవ్ మండల్ (ఎస్ఆర్ఎస్జీఎమ్) అనే సంస్థ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇన్య్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంది.
ఇందు కోసం బజాజ్ అలయన్స్ ఇన్య్సూరెన్స్ సంస్థకు రూ.1.4 లక్షలను ప్రీమియంగా చెల్లించి పాలసీని తీసుకున్నట్టు ఎస్ఆర్ఎస్జీఎమ్ అధికారి సుధీర్ సాల్వి తెలిపారు. గత 75 సంవత్సరాలుగా చతుర్థి నాడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, భారీ మొత్తంలో ఇన్య్సూరెన్స్ తీసుకోవడం ఇదే తొలిసారని అన్నారు.
రాజధానిలో జరిగే తరహాలోనే ముంబై నగరంలో కూడా వినాయకుని వేడుకలు పదిరోజుల పాటు జరుగుతాయి. తర్వాత విగ్రహాలను పదకండో రోజు ఊరేగింపుగా తీసుకువెళ్లి సముద్రంలో నిమజ్జనం చేస్తారు.
|