|
కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుని దర్శించుకుంటే.. సకల సంపదలు చేకూరతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఐదు గంటలకు లేచి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి.
తలస్నానం చేసి, తెలుపు దుస్తులను ధరించి శివ పార్వతీదేవీల పటానికి పసుమ కుంకుమపెట్టి తెల్లటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యంగా బూరెలు, గారెలు, అన్ని ఫలాలను సమర్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున శివఅష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
అదే విధంగా శివ పంచాక్షరీ స్తోత్రము, శివ సహస్ర నామము, శివపురాణములను పారాయణం చేసినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలకు వెళ్లి... అందులో ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యఫలములు ప్రాప్తిస్తాయి.
|