మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రి" పర్వదినం సోమవారం రోజున వస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఈ ఏడాది సోమవారం నాడే శివరాత్రి పర్వదినం రావడం శుభసూచకమని వారు చెబుతున్నారు. సోమవారం వచ్చే మహాశివరాత్రి రోజున శైవక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటిజన్మల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అందుచేత శివరాత్రి (సోమవారం) రోజున శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం వంటి ఆలయాలకు వెళ్లి శివపరమాత్మను దర్శించుకునే వారికి సకలసపందలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇదేరోజున శివధ్యానము చేయడం, ఆలయాల్లో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశరుద్రాభిషేకం చేయించడం ద్వారా స్త్రీలకు దీర్ఘసౌభాగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసముండి (భోజనము చేయరాదు), రాత్రంతా జాగరణ చేసి (నిద్రపోరాదు) శివ నిత్యపూజ, శివస్తోత్రమాల, రుద్రనమకచమకమ్ నిత్యజీవితములో రుద్రాక్షలు అనే పుస్తకాలను సన్నిహితులకు దానం చేయడం ద్వారా పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. అదేవిధంగా స్త్రీలకు తాంబూలంతో పాటు శివభక్తిమాల, శివదీక్ష అనే పుస్తకాలను అందించే వారి గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు. |