" నమోభగవత్త్యె దశపాపహరాయై గంగాయై, నారాయణ్యై, రేవత్త్యె, శివాయై దక్షాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమోనమః" అనే మంత్రంతో గంగామాతను పూజించాలని పండితులు చెబుతున్నారు. దశమినాడు పై మంత్రమును ఉచ్ఛరిస్తూ గంగామాతను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దశమి నాడు మాత్రమే కాకుండా జ్యేష్ఠశుక్ల ద్వాదశి రోజున కూడా గంగాపూజ చేయడం ద్వారా మోక్షమార్గము సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. గంగాతీరంలో లేదా.. ఇంట్లోనే గంగాజలం నిండిన కలశానికి తెల్లటి నూలు చుట్టి, లేత మామిడి ఆకులను కలశానికి పైన అమర్చి, పై భాగమున కొబ్బరికాయను ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు, కలశానికి పసుపు కుంకుమలు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. ఈ కలశాన్ని అరటిఆకుపై, బియ్యం పోసి దానిపై పెట్టాలి. ఆ తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, కర్పూర హారతులను సమర్పించి గంగామాతను నిష్ఠతో కొలిచిన వారికి అష్టైశ్వర్యాలు, విశేష ఫలం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. |