వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు. " వైశాఖ శుక్లపక్షేతు తృతీయా రోహిణి యుతాదుర్లభా బుధచారణే సోమనాపి యుతా తథా"వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణియుతమైన రోజునే, అక్షయతృతీయ పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. |