మాఘశుద్ధ షష్టినాడు కుమార స్వామిని ఆరాధించడం ఉత్తమ పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని పురోహితులు అంటున్నారు. ఈ రోజున నాగదేవిని కొలిచి పుట్టలో పాలు పోసేవారికి సుఖసంపలు చేకూరుతాయని విశ్వాసం.మాఘశుద్ధ షష్టినాడు ఒంటి పూట భోజనం చేసి, షష్టీ వ్రతాన్ని ఆచరిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, పరిశుభ్రమైన గృహాన్ని మామిడాకుల తోరణాదులతో అలంకరించాలి. పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం." సుబ్రహ్మణ్యాష్టకం" నుండి" హే స్వామినాధ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సుముఖ పద్మ సింధో దేవాధినాధ గణ సేవిత పాద పద్మ వల్లీశనాధ మమదేహి కరావలంబమ్"" నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప వల్లీశనాధ మమదేహి కరావలంబమ్"అనే శ్లోకముతో కొలిస్తే సంతాన ప్రాప్తి, వ్యాపారాల్లో వృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. సుబ్రహ్మణ్యాష్టక శ్లోకమును పఠించిన పిమ్మట సుబ్రహ్మణ్యేశ్వరుడికి చక్కెర పొంగలిని నైవేద్యం పెట్టి పంచహారతులివ్వాలి. ఇలా మాఘశుద్ధ షష్టినాడు కుమార స్వామిని నిష్టతో ప్రార్థిస్తే తలచిన కార్యాలు విజయవంతమౌతాయని పురోహితులు చెబుతున్నారు. |