సువిశాలమైన భారతదేశం 'భిన్నత్వంలో ఏకత్వానికి' ప్రతీక. దేశంలో ఎన్ని మతాలు, కులాలున్నా ప్రజలందరూ సమైక్యంగా కలిసిమెలిసి జీవిస్తారు, అలాంటి మనదేశంలో వారివారి మతాలకు సంబంధించిన ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మసీదులు ఇలా.. పలురకాలుగా ఉన్నాయి. వీటిలో పూజలుపునస్కారాలు ఆయా మతాచారాలకు అనుగుణంగా జరుగుతుంటాయి. వీటిని ఆయా మతాలకు చెందిన నిపుణులే ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తుంటారు.కానీ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో ఉన్న ఓ శివాలయంలో మాత్రం ముస్లింలు పూజ చేస్తున్నారట. పహల్గామ్లోని పురాతన శివాలయం 990 ఏళ్ల చరిత్ర కలిగివుంది. ఈ ఆలయంలో మహమ్మదీయులే అర్చకులుగా శివ పూజలు చేస్తున్నారు. మెహమద్ అబ్దుల్లా, గులాం హసన్ అనే ముస్లింలు 1989 నుంచి ఈ ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో తరతరాల నుంచి వారసత్వ పూజారులుగా ఉన్న వారు కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లారు. దీంతో శివాలయంలో ముస్లిం సోదరులు శివపూజలు చేస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. |