సాకేత పురవాసుడు శ్రీరాముని పరమభక్తుడు గోస్వామి తులసీదాసు. రామాయణాన్ని హిందీ మూలంలో అందించిన తొలి కవి తులసీదాసు. అలాగే రాముని బంటు అంజనానందనుడుపై హనుమాన్ ఛాలీసాను విరచించి పావనుడయ్యాడు తులసీదాసు. గోస్వామి తులసీదాసు ఉత్తర ప్రదేశ్ బాండా జిల్లా రాజ్పూర్లో 1532లో జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి అంశ తులసీదాసని అంటారు.
తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసును అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తర ప్రదేశ్లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
శ్రీరామచరితమానస్ సాధారణ ప్రజలు చదవటానికి వీలులేకుండా ఉన్న సంస్కృతంలో వాల్మీకి విరచించిన రామాయణాన్ని హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంధం రచనా కార్యక్రమాన్ని దశరథ నందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంధం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంధంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.
తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్, కృష్ణ గీతావళి, హుమాన్ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని వంటివి ఉన్నాయి.
సాకేత రాముడి దర్శన భాగ్యం కల్పించిన హనుమంతుడికి కృతజ్ఞతలు చెప్పేందుకై వారణాసిలో సంకటమోచన్ దేవాలయాన్ని తులసీదాసు కట్టించాడు. ఈ దేవాలయం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దక్షిణ దిక్కులో ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రతి మంగళ, శని వారాల్లో అధిక సంఖ్యలో వస్తారు.
|