ఉత్తర భారతంలో మత విద్వేషాలు ఉన్న సమయంలో అందరినీ కుటుంబంలా కలిపి ఉంచటానికి రాం రహీం ఒక్కరే అని ఎలుగెత్తి చాటాడు కబీర్. మానవత్వానికి కబీర్ ప్రాధాన్యత ఇచ్చాడు. భక్తి ఉద్యమంలో ఉత్తర భారతం నుంచి తొలి తరం మత ప్రచారకుడు కబీర్దాస్. కబీరు అంటే అర్ధం గొప్ప. కబీరు పదం అరబిక్ భాష నుంచి వచ్చిందంటారు.
ఉత్తర ప్రదేశ్లో పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రమైన వారణాసిలో జన్మించాడు కబీర్. పుట్టుకతోనే అనాథ అయిన ఆయనను ముస్లిం దంపతులు పెంచారు. భారతీయ తత్వ శాస్త్రానికి కొత్త రూపురేఖలు ఇచ్చారు కబీర్. రామానంద స్వామిని ఒకసారి కలిసిన కబీర్ ఆయన చెప్పిన మాటలను జీవితంలో అమలుచేశాడు. ఆ సమయంలో హిందూ మత గురువుగా రామానంద స్వామికి మంచి పేరుంది.
రామానంద్ నుంచి జ్ఞానోదయం పొందిన కబీరు రామ తారక మంత్రమును పటించి శ్రీరామ భక్తుడయ్యాడు. కబీర్ ఎక్కడా తాను ఈ మతానికి చెందిన వాడినని స్పష్టం చేయలేదు. కబీరు సమయంలో ఉత్తరాదిలో హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలు ఎక్కువగా చోటుచేసుకుంటుండేవి. దీనిని నియంత్రించటానికి కబీరు రాం రహీం ఒక్కరే అని ఎలుగెత్తి చాటారు. ఆ కాలంలో ఉన్నటువంటి మతాలు, తెగల దురాచారాలను కబీరు విమర్శించారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ను కబీరు కలిశాడని అంటారు. దీనితో ఆయన సిక్కు మత పవిత్ర గ్రంధమైన గురు గ్రంథ్ సాహెబ్లో దాదాపు 500 పద్యాలను అందించారు. సిక్కు భగత్లలో మూడవ వ్యక్తిగా కబీరును వారు పరిగణిస్తారు. కబీరు ప్రవచనాలను అనుసరించేవారిని కబీర్పంత్లుగా పిలుస్తారు. దాదు పంత్, దరియా పంత్లు కబీరు పంత్లలో ఒకరు. వీరు హిందూ-ముస్లింల తమ మధ్య ఉన్న విభేదాలను విడనాడాలని ప్రచారం చేశారు.
|