విఘ్నాలను తీర్చే దేవుడు వినాయకుడు. వినాయక చవితి నాడు దేవుడికి ఉండ్రాళ్లు, కుడుములు, బూరెలు, పాయసం... ఇలారకరకాల పిండివంటలను చేసి నైవేద్యం పెడతాము. అయితే మనం చేయని ఇంకో పిండివంట ఒకటి ఉంది. అదే లడ్డు. దీనిని కొన్ని ప్రాంతాలవారు చేసినా ముఖ్య పిండివంట మాత్రం ఉండ్రాళ్లే.
రాజధాని నగరంలో వినాయక చవితి అంటే చాలా పెద్ద పండుగ. ఈ పండుగను పదకండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని చోట్ల తొమ్మిది రోజులు, ఏడు రోజులు... ఇలా ఆయా ప్రాంతాల ఆచారాన్ని బట్టి జరుపుతారు. ఈ పదకండు రోజులు విగ్రహానికి పూజలు జరిపి, నైవేద్యాలు సమర్పిస్తారు.
నగరంలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసే విగ్రహాల చేతిలో ఈ లడ్డు తప్పనిసరిగా ఉంటుంది. ఈ లడ్డును ప్రతి ఏటా వేలం కూడా వేస్తారు. బాలాపూర్ లడ్డు వేలం ప్రఖ్యాతి గాంచింది. ఈ లడ్డును వేలంలో కొన్నవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం.
వేడుకల్లో చివరి రోజైన పదకండో రోజున స్వామివారిని అన్ని వీధుల్లో తిప్పుతూ గణపతి పప్పా హోరియా... చారా లడ్డు చోరియా... అంటూ ఊరేగిస్తారు. ఆఖరున స్వామి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాలవారు పాల్గొనడం విశేషం.
|