ఏ కార్యం తలపెట్టినా ముందుగా 'సర్వ విఘ్నోప శాంతయే' అని దేవతలు సైతం విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తారు. తాము పూర్తి చేయదలచిన పనికి విజయం చేకూరాలని వేడుకుంటారు. అలా దేవతలే పూజించే మహిమ గల దేవుడే ఓ బొజ్జగణపయ్య. ఈ గణపయ్య ఉత్సవాలు బుధవారం దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
చవితి వేడుకలను పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆదిదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రులు చిన్నారెడ్డి, గల్లా అరుణ కుమారిలు కాణిపాకం వచ్చి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులు రావచ్చని ఆలయ మండలి అంచనా వేస్తోంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను భారీ ఎత్తున పూర్తి చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయగా, ఎక్కడా కూడా లడ్డూల కొరత రాకుండా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తును కల్పించారు.
|