వైకుంఠ ఏకాదశి పర్వదినాన మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. రెండు ఎర్రటి ప్రమిదలను తీసుకుని, తామర వత్తులతో పంచముఖ దీపారాధన చేయడం శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. పూజ చేసే సమయంలో తూర్పుదిక్కున తిరిగి విష్ణుమూర్తిని పూజించాలి. దీపారాధనకు కొబ్బరినూనెగానీ, ఆవునేతిని గానీ ఉపయోగించడం ద్వారా మోక్షఫలము సిద్ధిస్తుంది. నుదుట తిరునామము, మెడలో తులసి మాల ధరించి, "ఓం నమోనారాయణాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. జపమునకు తులసిమాల వాడటం మంచిది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తికి పంచామృతములతో అభిషేకం చేయించే వారికి పుణ్యఫలములు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్ర నామము, శ్రీమన్నారాయణ స్తోత్రములతో విష్ణుమూర్తిని పారాయణ చేయడం శుభప్రదం. అదేవిధంగా విష్ణుపురాణములోని దశావతార అధ్యాయములను పఠించడం మంచిది. విష్ణు ధ్యానములు, విష్ణు సహస్రనామ పూజలు చేసి, విష్ణు, శ్రీ వేంకటేశ్వర ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం |