తిరుపతి, భద్రాచలం వంటి వైష్ణవ దేవాలయ ఉత్తర ద్వారాలను మామూలు రోజుల్లో మూసే ఉంచుతారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. అందుచేత ఆ రోజున భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ చేయాలి. ప్రముఖ వైష్ణవ దేవాలయాలలో ఉత్తర ద్వారం ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని, దైవదర్శనం చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశిన ఇలా... ఉత్తరద్వార ప్రదక్షిణలు చేసుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.ఇంకా చెప్పాలంటే... "పుత్రద" ఏకాదశి అని పిలువబడే ముక్కోటి ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం శుభప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. పూర్వం "సుకేతుడు"-"భద్రావతి" అనే రాజదంపతులకు ఏకాదశీ వ్రతం ఆచరించడం ద్వారానే పుత్రసంతానం కలిగిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత ఆ రోజున శుచిగా, నిష్ఠనియమాలతో వ్రతమాచరించి విష్ణుమార్తిని కొలిచే వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. |