దక్షిణ కాశిక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం దేవి నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారికి కన్యకా సుహాసిని పూజ, చతుష్టోపచార పూజలను ఈ సందర్భంగా అర్చకులు వైభవంగా నిర్వహించారు. దేవి నవరాత్రుల ప్రారంభానికి వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా, శరన్నవరాత్రుల సందర్భంగా... ఇంద్రకీలాద్రి, శ్రీశైలం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై బుధవారం కనకదుర్గ అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం చేశారు. అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయ వరుసల్లో బారులు తీరారు.
మరోవైపు శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారికి బుధవారం బ్రహ్మచారిణి అలంకారం చేశారు. అనంతరం మల్లికార్జునుడు, భ్రమరాంబికా అమ్మవారిని మయూర వాహనంపై ఊరేగించారు. సర్వాలంకార భూషితులై మయూర వాహనంపై ఊరేగిన పార్వతీపరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. |