శుక్రవారం మూలానక్షత్రం కావడంతో పాటు శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి కొండపై భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్రోడ్డులో ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని సబ్కలెక్టర్ చెన్నకేశవరావు తెలిపారు. వీఐపి టికెట్ కొనుగోలు చేసిన వారు సైతం ఈ విజ్ఞప్తిని గమనించాలన్నారు.
శుక్ర, శనివారాల్లోకొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని చెన్నకేశవరావు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు కూడా తమ ఏర్పాట్లతో కొండపైకి చేరాల్సి ఉంటుందన్నారు.
ఆలయ ఉద్యోగులు భక్తులకు మంచినీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, స్వైన్ ఫ్లూ అనుమానాలున్న వ్యక్తులు వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స చేయాలని చెప్పారు. స్నాన ఘట్లా వద్ద భక్తుల రద్దీ ఎక్కువైతే పున్నమి ఘాట్కు భక్తులను తరలించేందుకు దేవస్థానం తరపున అవసరమైన బస్సులను సిద్ధం చేసుకోవాలన్నారు.
ఆర్టీసీ బస్సు స్టాండు ఎదురుగా ఉన్న పద్మావతి ఘాట్లో జల్లు స్నానం ఏర్పాటైందని, మహిళలకు విడిగా జల్లుస్నానం ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ అన్నారు. పున్నమి ఘాట్ వద్ద కూడా స్నానాలు చేయవచ్చునని ఆయన చెప్పారు.
ఇకపోతే.. శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆలయ నిర్వాహం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భక్తులకు వసతి, సదుపాయాలను కల్పించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.