తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు వజ్ర కిరీటాన్ని కానుకగా సమర్పించారు. పారిశ్రామిక వేత్త అయిన కుమార్ అమ్మవారికి రూ. కోటి పాతిక లక్షల విలువ చేసే వజ్ర కిరీటాన్నిబహుకరించినట్లు తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి విలేకరులతో చెప్పారు.
నాలుగు కిలోల బంగారం కిరీటంపై వజ్రాలు పొదిగిన ఈ కిరీటాన్ని రానున్న పర్వదినాల్లో అమ్మవారికి అలంకరిస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా కుమార్ వెంకన్నకు కూడా వజ్రాల కిరీటం చేయించే యోచనలో ఉన్నట్లు కరుణాకర రెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో తితిదే మొదటి సారిగా ఈ ఆర్జిత సేవను ప్రవేశ పెట్టడం విశేషం. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు అమ్మవారిని సుప్రభాత సేవలో మేల్కొలిపి సహస్రమార్చన, నిత్యార్చన పూజలు నిర్వహించారు.
తదుపరి అమ్మవారికి మొదటి గంట నైవేద్యం సమర్పించి గర్భాలయంలోని ముఖమండపం వద్దకు ఉత్సవ మూర్తిని వేంచేపు చేశారు. తదనంతరం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆగమ పండితులు, తిరుమాలాచార్యుల ఆధ్వర్యంలో అష్టోత్తర శతకలశాలను కొలువు తీర్చి ఆవాహన పూజను నిర్వహించారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తికి 108 కలశాల్లోని నీటితో అభిషేకం చేసిన వైనం భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది.
|