లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలు వచ్చేనెల (సెప్టెంబర్) 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నిమజ్జనోత్సవాల ఊరేగింపు 14న జరుగుతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి జి. హనుమంతరావు వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిమజ్జన ఊరేగింపును మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 3న వినాయక చవితి సందర్భంగా జంటనగరాల్లోని వాడవాడలా మంటపాలను ఏర్పాటు చేసుకుని స్థానిక భక్తులు విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవ పూజలను ప్రారంభించడం ప్రతీతి.
అత్యంత వైభవంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టనున్నట్లు హనుమంతరావు తెలిపారు. మరోవైపు బెంగుళూరు-అహ్మదాబాద్ బాంబు పేలుళ్లను అనుసరించి ఉత్సవాలకు పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
|