గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. ఈనెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన చవితి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు భక్తి పారవశ్యంతో గణనాధుని పూజిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఒక రావి చెట్టు కాండం వినాయకుని రూపంలో ఉంది. దీంతో దీన్ని తిలకించేందుకు ఆ ప్రాంతంలోని స్థానికులు తరలి వస్తున్నారు.
తిరుపతి సమీపంలోని పెరమాళ్ళ పల్లి అనే గ్రామంలోని వినాయకుడి ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు ఉంది. ఈ చెట్టు కాండంపై వినాయకుడి ఆకారంలో కొంత కాండ భాగం దర్శనమిస్తోంది. దీన్ని వినాయకుడి వింతగా భావించిన ఆ గ్రామస్థులు కాండం వినాయకుడుని చూసేందుకు తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఈ కాండం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ప్రార్థిస్తున్నారు.
|