తిరుమలలో అక్టోబర్ 1 నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లను తితిదే ఈవో రమణాచారి, ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.రవిచంద్ర తదితరులు సంయుక్తంగా అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా వారు పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఈ వివరాలను తితిదే వర్గాలు విలేకరులతో వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని తీర్మానించినట్టు చెప్పారు. గతంలో రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లు నమోదు చేసుకున్న భక్తుల దర్శన సమయాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఉత్సవాల సమయంలో భక్తులందరికీ రామాయణం, భగవద్గీత, సుప్రభాతం పుస్తక ప్రసాదాలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే నెల 1న ధ్వజారోహణం జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.
|