ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన సింహాచలం వరాహ నృసింహస్వామి దేవాలయంలో లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న సుదర్శన నృసింహ యాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం త్రిదండి చిన జీయర్ స్వామి పర్యవేక్షలో సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్న ఈ యాగంలో సుమారు 350కి పైగా రుత్వికులు పాల్గొన్నారు.108 హోమకుండలాల్లో వైభవంగా జరిగిన ఈ యాగం మంగళాశాసనముతో ప్రారంభమైంది. ఉత్సవమూర్తులను యాగశాల ప్రవేశం చేసి, అనంతరం అగ్నిమధనాన్ని చేపట్టారు. యాగశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా రూపొందించిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.హోమకుండలాల్లో అగ్నిమధనం చేపట్టిన తర్వాత... శాంతిపాఠం, పారాయణాలు నిర్వహించారు. ఈ యాగం పూర్తయిన అనంతరం స్వామివారి తీరువీధి సేవను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వేలాది మంది భక్తులు నరసింహస్వామికి దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో స్వామివారికి ఉయ్యాల సేవను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.అనంతరం మంగళశాసనములు పూర్తిచేసి ఉత్సవమూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి పవళింపు సేవను చేపట్టారు. ఈ సుదర్శన యాగాన్ని పురస్కరించుకుని సింహగిరి భక్త జనంతో కిటకిటలాడింది. |