తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కైశిక ద్వాదశి మహోత్సవం కలిగిరి మండలం మహల్ దళితవాడలో వైభవంగా జరిగింది. టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మంగళకైశిక ద్వాదశి మహోత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. మహల్ దళిత వాడ, గంగాధర నెల్లూరులో ఈ ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. మహల్ దళిత వాడలో మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ స్వామివారి విగ్రహాన్ని పురవీధులలో ఊరేగించారు. అనంతరం వేదపండితులు నిత్యార్చన హోమం, పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి ఊరేగిన వైనాన్ని భక్తులు తిలకించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. |