శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో వెలసిన ఆదిత్యుని తెప్పోత్సవం వైభవంగా జరిగింది. సూర్యదేవాలయానికి అభిముఖంగా ఉన్న ఇంద్ర పుష్కరిణిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై ఉషా, ఛాయ, పద్మినీ సమేతుడైన శ్రీ సూర్యనారాయణస్వామిని ఆసీనులు గావించి ఊరేగించారు. ఈ తెప్పోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు గుమికూడారు. కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా అరసవల్లి ఆదిత్యుని ఆలయం భక్తకోటితో కిటకిటలాడింది. ఇదే విధంగా... కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శ్రీకాకుళంలోని శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో సోమవారం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. తొలుత దివ్యసుందరంగా అలంకరించిన తెప్పపై గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి శ్వేత పుష్కరిణిలో ఊరేగించారు.పుష్కరిణి మధ్యలో ఉన్న శ్రీ యోగ నరసింహస్వామికి ప్రత్యేక దీపారాధన జరిపారు. ఈ తెప్పోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులను పొందారు. |