కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలను భారీ ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో పంచారామ శైవక్షేత్రాలు కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉండగా... విజయవాడలోని శివాలయంలో మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అదేవిధంగా శ్రీశైలంలో భక్తులు ఆలయ ప్రాంగణంలోని ఉసిరిచెట్ల కింద నోములు నోచుకున్నారు. తెల్లవారు జామునే ఓంకార, లింగాకర రూపాల్లో ప్రమిదలను వెలిగించారు. ఇకపోతే... కార్తీక సోమవారాల్లో వనభోజనం చేయడం ఓ ప్రతీతి. ఉసిరిక చెట్టుకింద భోజనం చేయడం ద్వారా శుభప్రదమని ఆర్యుల విశ్వాసం. ఈ సోమవారాల్లో శివుడిని అర్చించి, అనంతరం అన్నదానమును నిర్వహించి, అతిథి సత్కారాల తర్వాత కార్తీక వ్రతాన్ని చేపట్టిన వారు భుజించినట్లైతే కోటి పుణ్యఫలము ప్రాప్తిస్తుందని ఐతిహ్యం. ఈ నియమాలను పాటించడం ద్వారా శివానుగ్రహం కలిగి సర్వపాపములు నశించును. |