పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి అందరినీ ఆకట్టుకున్న భక్తవరాహం ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది.
ఆదివారం ఉదయం తణుకులోని వెటర్నరీ పాలీ క్లినిక్ నుంచి భక్తవరాహాన్ని డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించారు. వరాహం ఆరోగ్యం పూర్తిగా కోలుకుందని, వరాహం ఆరోగ్యానికి ఇక ఎలాంటి ప్రమాదముండదని వైద్యులు తెలిపారు.
భక్తవరాహం డిశ్చార్జి కానుందన్న విషయాన్ని తెలుసుకున్న ఎంతోమంది భక్తులు ఆస్పత్రికి వచ్చారు. పూలరథంలో భక్త వరాహాన్ని ఊరేగిస్తూ సిద్ధాంతం గ్రామానికి తీసుకెళ్లారు.
సిద్దాంతంలో భక్త వరాహానికి ఆ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వరాహాన్ని వెంకటేశ్వర ఆలయానికి తరలించి సమీపంలోని గోదావరిలో స్నానం చేయించారు. తర్వాత ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు.
ప్రదక్షిణలు పూర్తయ్యాక భక్త వరాహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుటీరంలో ఉంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తవరాహం ఆరోగ్యం కోలుకోవడంపై ఒకవైపు భక్తులు, మరోవైపు సిద్ధాంతం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. |