నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి 1వ తేదీ ఉదయం మూడు గంటల నుంచే శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సోమవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ సందర్భంగా వీఐపీ దర్శనాలను కూడా రద్దు చేయాలని తీర్మానించింది.ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని వైష్ణవ దేవాలయాలలో భజగోవిందం కార్యక్రమాలను నిర్వహించాలని తితిదే తలపెట్టింది. కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపట్టాలని తితిదే నిర్ణయించింది.ఇదిలా ఉంటే... శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు స్వామివారిని ముద్రించి ఉన్న వెండి డాలరును ఇవ్వనున్నట్లు తితిదే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, తితిదే పాలకమండలి సమావేశం సోమవారం తిరుమలలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలోనే అనేక విషయాలను చర్చించిన తితిదే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. |