కొత్త సంవత్సరం, ముక్కోటి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు, ఏర్పాట్లు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ వీఐపీలను నియంత్రించి సర్వదర్శనానికే ఆ రెండు రోజులలో ఎక్కువ సమయం కేటాయించనున్నామన్నారు. సర్వదర్శనం, రూ.50 ప్రత్యేక దర్శనం, ప్రోటోకాల్, సెల్లార్ దర్శన అనుమతులకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాలను దష్టిలో ఉంచుకొని వీఐపీలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, నూతన సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన ప్రభాతసేవలైన తిరుప్పావై ప్రవచనం, అర్చన, తోమాల తదితరాలను ఏకాంతంగా 12.05 గంటలకు ప్రారంభించి 1.45 గంటలకు పూర్తి చేస్తారు. 2 గంటల నుండి 2.45 గంటల వరకు ప్రోటోకాల్ పాసులను అనుమతిస్తారు. 3 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం. 500లకు మించకుండా వీఐపీ పాసులు మంజూరు. 9.30 గంటలకు 50 రూపాయల ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.
అలాగే యాభై వేల మందికి అన్నదాన ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాలలో సాంబారు, పెరుగన్నం ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తుల కోసం నాలుగు లక్షల లడ్డూలు, ప్రసాదాలు ఇప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉంచారు. |