తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఏడాదికి నాలుగుసార్లు చేపట్టే ఈ శుద్ధి కార్యక్రమాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తితిదే తెలిపింది. మంగళవారం నిర్వహించనున్న ఈ తిరుమంజనం పూర్తయ్యాక మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి సర్వదర్శనం ప్రారంభమవుతుంది.తిరుమంజనంలో భాగంగా... గర్భాలయ సన్నిధిలోని గోడలు, ఆలయంలోని వకుళమాలిక, యోగ నరసింహస్వామి, వరదరాజస్వామి, భాష్యకారులు తదితర పరివార దేవతల మందిరాలను శుద్ధి చేస్తారు. చందనం, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం తదితర సుగంధద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనాన్ని శుద్ధికోసం ఉపయోగిస్తారు. అలాగే ప్రసాదాలు తయారుచేసే పోటును కూడా శుభ్రం చేస్తారు. ఈ కార్యక్రమాన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. |