కలియుగదైవం తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. పసుపు, చందనం, కుంకుమ, తిరునామం, పచ్చకర్పూరం వంటి తదితర సుగంధద్రవ్యాలతో తయారు చేసిన ప్రత్యేక లేపనంతో గర్భాలయ సన్నిధిలోని గోడలు, ఆలయంలోని వకుళమాలిక, యోగ నరసింహస్వామి, వరద రాజస్వామి, భాష్యకారులు వంటి దేవతల మందిరాలను శుభ్రపరుస్తారు. అలాగే ప్రసాదాలు తయారు చేసే పోటును కూడా శుద్ధిచేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమాన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఏడాదికి నాలుగుసార్లు చేపట్టే ఈ శుద్ది కార్యక్రమాన్ని వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో నిర్వహించామని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమంజనం సందర్భంగా... మధ్యాహ్నం వరకూ సర్వదర్శనాన్ని నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు తితిదే తెలిపింది.ఇదిలా ఉండగా... వైకుంఠ ఏకాదశి (బుధవారం)ని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు తితిదే అధికారులు తెలిపారు. |