సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ రోజు బృంగీవాహనంపై శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దివ్య సుందరంగా ఊరేగుతూ.. భక్తులకు అభయప్రదానం చేశారు.ఆలయ ప్రాంగణంలో బృంగీ వాహనంపై స్వామివారు, అమ్మవార్లను అధిష్టింపజేసి పంచహారతులను సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ వైభవోపేతంగా జరిగింది. రాజగోపురాల గుండా ఆలయ పురవీధుల్లో ఈ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు శ్రీశైలం తరలివచ్చారు. దేవేరితో ఆలయ వీధుల్లో ఊరేగిన మల్లికార్జున స్వామిని భక్తకోటి భక్తిశ్రద్ధలతో కొలిచి, స్వామివారి ఆశీస్సులను పొందారు. |