తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం మీనలగ్న ముహూర్తంలో వైభవంగా ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య వృషభ సంకేతాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణం చేశారు. పాలు, పెరుగు, చందనం, పంచ ఫల రసాలతో ధ్వజస్తంభానికి త్రిశూలానికి అభిషేకం చేశారు. తర్వాత దీపారాధన గావించారు. అనంతరం స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. భోళాశంకరుడు హంసవాహనంపై ఊరేగారు. సోమవారం రాత్రి స్వామివారిని, కామాక్షి అమ్మవారిని పుష్పాలు, వివిధ స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించారు. దివ్య సుందరంగా అలంకృతమైన శంకరుడు పల్లకిలో ఆసీనులై ఆలయ వీధుల్లో ఊరేగగా, అమ్మవారు మరో పల్లకిలో స్వామిని అనుసరించారు. |